సాక్షి, నరసన్నపేట: రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లమ్మకు వైఎస్సార్ చేయూత ద్వారా సాయం చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. 45 ఏళ్లు దాటిన ప్రతి అక్కకు వైఎస్సార్ చేయూత అందుబాటులో ఉంటుందని అన్నారు. 45 నుంచి 60 ఏళ్ల నడుమ ఉన్న ప్రతి అక్కకు నాలుగు దఫాల్లో 75వేల రూపాయల సాయం ఉచితంగా అందజేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ప్రత్యేక హోదా వ్యతిరేకించిన టీఆర్ఎస్తో పొత్తు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు వెంపర్లాడారని సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు మురికి కాలువలో మునిగితే.. దానినే గంగా నది అంటారని ఎద్దేవా చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 322వ రోజు ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో జననేత అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. నాలుగన్నరేళ్ల చంద్రబాబు పాలనపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్.. ప్రజలు అవినీతి పాలనకు అంతం పలకాలని పిలుపునిచ్చారు.