‘ఒవైసీ బీజేపీ తొత్తు’

‘ఒవైసీ బీజేపీ తొత్తు’

హైదరాబాద్ : ఎంపీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై ఉర్దూ రచయిత మున్వవర్ రాణా సంచలన వ్యాఖ్యలు చేశారు. ముస్లింలలో చీలిక తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోన్న మరో జిన్నా అంటూ ఒవైసీపై విమర్శలు గుప్పించారు. ముస్లింల్లో చీలిక తీసుకొచ్చి, నాశనం చేయడానికి అసదుద్దీన్ ఒవైసీ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. భారతదేశంలో మరో జిన్నా తయారవడానికి ముస్లిం సమాజం అనుమతించదని అన్నారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఐదు స్థానాల్లో విజయం సాధించిన ఎంఐఎం.. చాలా చోట్ల మహాకూటమి విజయావకాశాలను దెబ్బతీసింది. ఈ నేపథ్యంలో మున్నావర్ రాణా ఒవైసీ విమర్శలు గుప్పించారు. ఒవైసీని బీజేపీకి తొత్తుగా అభివర్ణించిన రాణా.. ఎల్లప్పుడూ ముస్లిం సామాజిక వర్గంలో చీలిక తీసుకొచ్చి, కాషాయ పార్టీకి మేలు చేస్తున్నారని మండిపడ్డారు. బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ. గత ఎన్నికల్లో ఆరుచోట్ల పోటీచేసిన ఎంఐఎం.. ఒక్కస్థానం కూడా దక్కించుకోలేదు. కానీ, 2019లో కిషన్ గంజ్ ఉప-ఎన్నికలో విజయం సాధించింది.
ఈ ఎన్నికల్లో బీఎస్పీ, ఇతర చిన్న పార్టీలతో కలిసి కూటమిగా ఏర్పడిన ఒవైసీ భారీ ప్రయోజనమే పొందారు. ఏకంగా ఐదు చోట్ల విజయం సాధించడమే కాదు.. మహాకూటమికి విజయం దక్కకుండా చేశారు. మొత్తం 1.24 శాతం మేర ఓట్లు సాధించారు. ఎంఐఎం ముస్లిం ఓట్లు చీలిపోవడంతో బీజేపీ, జేడీయూకి కలిసొచ్చింది. దీంతో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos