న్యూ ఢిల్లీ: లాక్డౌన్ వల్ల నగరాల్లోని చిల్లర అంగళ్లు మళ్లీ కళ కళలాడుతున్నాయి. సిబ్బంది కొరత, సరకుల సరఫరా సమస్యల వల్ల మాల్స్, ఈ-కామర్స్ సంస్థలకు గడ్డు కాలం దాపురించడం ఇందుకు కారణం. దీంతో ఎక్కడా నిత్యావసర వస్తువులకు పెద్దగా ఇబ్బంది ఎదురుకాలేదు. ‘పాశ్చాత్య దేశాల్లో ప్రజలు ఇప్పటికీ షాపింగ్ మాల్స్ ముందు నిత్యావసరాల కోసం బారులు తీరుతున్నారు. లాక్డౌన్ సమయంలో మన దేశంలో ఆ పరిస్థితి తలెత్తకపోవడానికి కారణం ప్రతి వీధిలోనూ మూల మూలనా చిల్లర అంగళ్లు ఉండటమే. చిల్లర అంగళ్లు మన దేశానికి జీవనరేఖలా మారాయ’ని రిటైలర్స్ అసోసియేన్ ఆఫ్ ఇండియా (ఆర్ఏఐ) సీఈవో కుమార్ రాజగోపాలన్ వ్యాఖ్యానించారు. చిల్లర అంగళ్ల యజమానులు తమంతట తాముగానే పంపిణీదార్లు, టోకు వ్యాపారుల దగ్గరికి వెళ్లి అవసరమైన సరుకులు తెచ్చుకుంటున్నారు. కొన్ని చిల్లర అంగళ్లు నేరుగా నివాసుల సంక్షేమ సంఘంతో కలిసి పనిచేస్తున్నాయి. అవసరమైన సరుకులు, నిత్యావసరాలను ముంగట్లోనే అందిస్తున్నాయి. ప్రతి అపార్ట్మెంటుకు నిర్ణీత సమయాన్ని కేటాయించాయి. అన్ని ఆర్డర్లను మెయిన్ గేట్ వద్దకు తీసుకెళ్లి అందిస్తున్నారు.