ఢిల్లీ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్ దివంగత ఎన్డీ. తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ హత్య కేసులో ఆయన భార్య అపూర్వ శుక్లాను ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. రోహిత్ అనుమానాస్పద మృతిపై పోలీసులు మూడు రోజులుగా ఆమెను ప్రశ్నించారు. చివరకు బుధవారం అరెస్టు చేశారు. వైవాహిక జీవితంలోని గొడవల వల్ల భర్తను హతమార్చానని అపూర్వ అంగీకరించారని పోలీసులు తెలిపారు. భర్త తాగిన మైకంలో ఉన్నప్పుడు ఆమె ఈ దారుణానికి పాల్పడిందని వెల్లడించారు. ఈ హత్యలో ఆమె ఎవరి సహాయం తీసుకోలేదన్నారు. ఊపిరాడకనే రోహిత్ మరణించినట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో హత్య వెనుక ఇంట్లో ఎవరి హస్తం ఉందనే విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తూ, అపూర్వను గత ఆదివారం అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె పొంతన లేని సమాధానాలు చెబుతుండడం, సంఘటన జరిగిన సమయంలో ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో పోలీసుల అనుమానాలు బలపడ్డాయి. ఈ నెల 16న రోహిత్ మరణించిన సంగతి తెలిసిందే. రోహిత్, అపూర్వల మధ్య పెళ్లైన తొలి రోజు నుంచే సఖ్యత లేదని రోహిత్ తల్లి ఉజ్వల గతంలో చెప్పారు.