పాట్నా: బిహార్లో ఇద్దరు యువనేతల సమావేశం రాజకీయంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రీయ జనతాదళ్ నేత తేజస్వీ యాదవ్, లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్లు బుధవారం సమావేశమయ్యారు. వీరి సమావేశంపై అనేక వార్తలు వస్తున్నప్పటికీ.. తన తండ్రి సంవత్సరీకం సందర్భంగా తేజస్వీని పిలవడానికి వచ్చినట్లు చిరాగ్ తెలిపారు. అయితే ఆర్జేడీ-ఎల్జేపీ మధ్య పొత్తు కుదరనుందని వినవస్తోంది. గతంలో ఓ సందర్భంలో ఆర్జేడీ-ఎల్జేపీ మధ్య పొత్తు అవసరం ఉందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ వ్యాఖ్యానించడంతో తాజా ఊహాగానాలకు బలం చేకూరింది.
కాగా, తేజస్వీతో సమావేశం అంనతరం మీడియాతో చిరాగ్ మాట్లాడుతూ ‘‘మా తండ్రి చనిపోయి ఏడాది కావస్తోంది. దీని గుర్తుగా సెప్టెంబర్ 12న ఓ కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఆ కార్యక్రమానికి తేజస్వీని ఆహ్వానించాను. రేపు ఢిల్లీకి వెళ్లి లాలూ ప్రసాద్ యాదవ్ను కూడా కలుస్తాను. మా నాన్నతో పని చేసిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తాను. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ను కూడా ఆహ్వానిస్తాను’’ అని అన్నారు. అయితే ఇరు పార్టీల మధ్య పొత్తుపై చిరాగ్ స్పందించలేదు కానీ, తేజస్వీ మాత్రం స్పందించారు. ‘‘ఏం చెప్పాలో లాలూజీ చెప్పారు. అంతకు మించి మేం స్పందించలేము’’ అని అన్నారు.