తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ని కించపరిచేలా రాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. సుధాకరన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం విజయన్ సమర్ధవంతంగా పరిపాలిస్తారని తమ పార్టీ ఆశించిందనీ.. అయితే ఆయన ‘‘ఆడవాళ్లకంటే దారుణంగా’’ తయారయ్యారని పేర్కొన్నారు. గతేడాది కేరళను తుడిచిపెట్టిన భారీ వరదల తర్వాత రాష్ట్రాన్ని పునర్నిర్మించడంలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్రతిపక్ష యూడీఎఫ్ ఇవాళ ఆందోన చేపట్టింది. ఈ సందర్భంగా సుధాకరన్ మాట్లాడుతూ… ‘‘చాలామందిలా నేను కూడా పినరయి విజయన్ చేతల మనిషి అని నమ్మాను. తీరా వెనక్కి తిరిగి చూస్తే, ఆయన దారుణంగా విఫలమైన ముఖ్యమంత్రిగా నిరూపించుకున్నారు. మార్పు తీసుకురాగల నాయకుడని అందరితో పాటు నేను కూడా భావించాను కానీ ఆయన చేసిందేమీ లేదు. ఆయన కంటే ఆడవాళ్లే బాగా పనిచేస్తారు…’’ అని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు పార్టీ అధిష్టానం ప్రకటించిన తరుణంలోనే సదరు కాంగ్రెస్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.