చైనా పెట్టుబడులు పెంచితే ఉద్యోగాలు – డ్రాగన్‌

చైనా పెట్టుబడులు పెంచితే ఉద్యోగాలు – డ్రాగన్‌

బీజింగ్‌: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ దేశంలో నిరుద్యోగ సమస్య రాజకీయాస్త్రంగా మారుతోంది. దీన్ని అజెండాగా తీసుకుని ప్రతిపక్ష కాంగ్రెస్‌.. భాజపా, ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శనాస్త్రాలు సంధిస్తూనే ఉంది. ఇటీవల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. మన దేశంలో తయారీరంగం విస్తృతంగా లేకపోవడంతో ఉద్యోగాల కొరత ఉందని, అదే తయారీరంగ దిగ్గజం చైనాలో మాత్రం నిరుద్యోగ సమస్యే లేదంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. దీనిని పావుగా వాడుకోవాలనుకుందో ఏమో.. భారత్‌లోని ఉద్యోగాల కల్పనపై చైనా స్పందించింది.. ఉద్యోగాలు సృష్టించడంలో ప్రధాని మోదీకి సాయం చేస్తామని చెబుతోంది. అయితే అందుకు భారత్‌లో చైనా పెట్టుబడులు పెరగాల్సిన అవసరం ఉందని మెలికపెట్టింది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా గ్లోబల్‌ టైమ్స్‌ తన కథనంలో పేర్కొంది.‘భారత్‌లో నిరుద్యోగ సమస్యతో ఆ దేశ ప్రధాని నరేంద్రమోదీ ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇది చైనాకు మంచి విషయం కాదు. ఎందుకంటే డోక్లాం ప్రతిష్టంభన తర్వాత భారత్‌-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. మరోసారి మోదీ అధికారంలోకి వస్తే ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమవుతుంది. అందుకే ఉద్యోగాల కల్పనలో మోదీకి సాయం చేయాలని చైనా భావిస్తోంది’ అని ఆ కథనం తెలిపింది.అయితే సాయం పేరుతో చైనా భారత్‌లో తమ పెట్టుబడులను పెంచుకోవాలని చూస్తోంది. యువతలో మోదీ పాపులారిటీ మళ్లీ పెరగాలంటే భారత్‌లో చైనా పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉందంటూ డ్రాగన్‌ దేశం సూచనలు చేస్తోంది. ‘భారత్‌లో ప్రభుత్వం గందరగోళంలో ఉంది. చైనా పెట్టుబడులపై ఆ దేశం ఆంక్షలు విధిస్తే గనుక అది అక్కడి యువత ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపిస్తుంది. చైనా పెట్టుబడులతో కొత్త ఉద్యోగాలు సృష్టించొచ్చు. తద్వారా సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ రాజకీయ ప్రాబల్యం కూడా పెరుగుతుంది’ అని గ్లోబల్‌ టైమ్స్‌ కథనం పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos