ముంబై: అన్ని ఆలయాల్నితెరవాలని డిమాండ్ చేస్తూ భాజపా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇక్కడి సిద్ధి వినాయక ఆలయం వద్ద ఆ పార్టీ నాయకులు మంగళవారం నిరసనకు దిగారు. ఆంక్షల్ని ఉల్లంఘించి దాటి గుడిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించినపుడు కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు భాజపా శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పార్టీ నాయకుడు ప్రసాద్ లాద్ సహా కొంత మంది భాజపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం దుకాణాల ఆరంభానికి అనుమతిచ్చిన ప్రభుత్వం ఆలయాలను మాత్రం ఎందుకు తెరవడం లేదని భాజపా నేత ప్రవీణ్ దరేకర్ ప్రశ్నించారు. మానసిక ప్రశాంతత కోసం ఆలయానికి వెళ్లే వారిని, మందిరాలపై ఆధారపడి జీవించే చిరు వ్యాపారులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలని కోరారు.