నిలిచిపోయిన సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర

నిలిచిపోయిన సునీతా విలియమ్స్‌ రోదసి యాత్ర

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ రోదసి యాత్ర నిలిచిపోయింది. వారు వెళ్లాల్సిన బోయింగ్ స్టార్లైనర్ వ్యోమనౌకను మోసుకెళ్లాల్సిన రాకెట్లో సాంకేతికత లోపం తలెత్తడమే దీనికి కారణం. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8.04 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉంది. కానీ, చివర్లో గుర్తించిన లోపం కారణంగా ప్రస్తుతానికి ఈ మిషన్ను వాయిదా వేస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. తిరిగి ఎప్పుడు చేపడతారనేది మాత్రం వెల్లచడించలేదు. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్లో ఉన్న కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి బోయింగ్కు చెందిన అట్లాస్ V రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధమైంది. సరిగ్గా 90 నిమిషాల ముందు మిషన్ను ఆపేస్తున్నట్లు నాసా ప్రకటించింది. రాకెట్లోని ఆక్సిజన్ రిలీఫ్ వాల్వ్ పనితీరు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. అప్పటికే వ్యోమనౌకలోకి ప్రవేశించిన సునీతా విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తాజా మిషన్లో భూకక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో వారం పాటు బసచేయాలనేది ప్రణాళిక. స్టార్లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. 2019లో ప్రయోగాత్మకంగా చేపట్టిన స్టార్లైనర్ తొలి మానవరహిత యాత్ర ఐఎస్ఎస్ను చేరుకోలేకపోయింది. మరో యాత్రలో పారాచూట్ సమస్యలు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. స్టార్లైనర్తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి. తాజాది విజయవంతమైతే ఐఎస్ఎస్కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వస్తుంది. ప్రస్తుతం స్పేస్ఎక్స్ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos