హొసూరు : సీనియర్ పాత్రికేయుడు ఏపీ. సురేష్ అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. హొసూరు ప్రాంతంలోని జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేసిన ఆయన స్థానిక ప్రెస్ క్లబ్ను ఏర్పాటు చేసి వ్యవస్థాపక అధ్యక్షుడుగా పని చేశారు. అనంతరం మీడియా క్లబ్ గౌరవాధ్యక్షుడుగా చురుకుగా వ్యవహరించారు. తెలుగు, తమిళ దిన పత్రికల్లో పని చేసిన ఆయన జర్నలిస్టుల సంఘాన్ని స్థాపించి, దాని ద్వారా పాత్రికేయుల సంక్షేమం కోసం కృషి చేశారు. ఆయన మృతి పట్ల మీడియా క్లబ్, ప్రెస్ క్లబ్, ప్రింట్ మీడియా, పలు జర్నలిస్టు సంఘాలు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశాయి. మాజీ మంత్రి పి. బాలకృష్ణా రెడ్డి, హొసూరు ఎమ్మెల్యే సత్య, తళి ఎమ్మెల్యే ప్రకాష్, మాజీ ఎమ్మెల్యేలు గోపీనాథ్, మనోహరన్, టి. వెంకట రెడ్డి ప్రభృతులు సంతాపం వ్యక్తం చేస్తూ, జర్నలిస్టుల సంక్షేమానికి ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఆయన మృతి జర్నలిజానికి తీరని లోటని పేర్కొన్నారు.