న్యూ ఢిల్లీ: హాథ్రస్ దళిత యువతిపై జరిగిన సామూహిక అత్యాచారంలో కుల విభజన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు ఎక్కుపెట్టారు. నిజం నుంచి దూరంగా పారిపోవాలని అనుకుంటున్నారని పరోక్షంగా భాజపాను ఉద్దేశించి అన్నారు. సమాజంలో మార్పు తీసుకు రావాలని ప్రజలను అభ్యర్థించారు. హాథ్రస్లో కుల వివక్ష పై ఒక వార్త సంస్థ కథనాన్ని ట్విట్టర్లో జత పరిచారు. ‘నిజం నుంచి దూరంగా పారి పోవాలనుకునే వారికోసమే ఈ వీడియో. మనలో మార్పు వస్తేనే దేశం మారుతుంద’ని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. హాథ్రస్ ఘటన విచారణకు అలహాబాద్ హై కోర్టు కొత్త తేదీని ప్రకటించినట్లు అడిషనల్ అడ్వకేట్ జనరల్ వీకే షాహీ తెలిపారు. నవంబర్ 2న వాదనలు విననుందని చెప్పారు.