హొసూరు : ఇక్కడికి సమీపంలోని జోగిరిపాళ్యం గ్రామంలో తాగు నీటి సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. గ్రామంలో సుమారు 70 కుటుంబాలు ఉన్నాయి. గత కొద్ది రోజులుగా తాగు నీటి సదుపాయం లేకపోవడంతో గ్రామ ప్రజలు అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. వారి నుంచి ఎంతకూ స్పందన లేకపోవడంతో విసిగిపోయిన మహిళలు హొసూరు -బేరికే రోడ్డుపై ఖాళీ బిందెలతో మహిళలు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రెండు గంటల పాటు ఈ మార్గంలో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందడంతో అధికారులు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. తాగునీటి సరఫరాకు చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు.