ఢిల్లీ : తెలుగు సినిమా మహానటికి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు లభించింది. 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ఇక్కడ ప్రకటించారు. అలనాటి నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కీర్తి సురేశ్ సావిత్రి పాత్రలో నటించారు. జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా ఆమెనే వరించింది. సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్లు ఇతర పాత్రలను పోషించారు. గత ఏడాది ఈ చిత్రం విడుదల కాగా, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. లోక్సభ ఎన్నికల కారణంగా ఈ ఏడాది పురస్కారాలను ఆలస్యంగా ప్రకటించారు. సాంకేతిక విభాగాల్లో ఈసారి తెలుగు సినిమాలకు ఎక్కువ పురస్కారాలు లభించాయి. రంగ స్థలం చిత్రానికి ఉత్తమ ఆడియోగ్రఫీ అవార్డు లభించింది. హిందీలో ఉత్తమ చిత్రంగా అంధాధున్ ఎంపికైంది. పద్మావత్ చిత్రానికి సంగీతం అందించిన దర్శకుడు సంజయ్లీలా భన్సాలీ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు దక్కించుకున్నారు.