హొసూరు : ఇక్కడికి సమీపంలోని సానమావు అటవీ ప్రాంతంలో మకాం వేసి, పంటలను నాశనం చేస్తున్న 50 ఏనుగులను బుధవారం సాయంత్రం హొసూరు అటవీ శాఖ అధికారులు డెంకణీకోట ఆటవీ ప్రాంతానికి తరిమివేశారు. మిగిలిన 40 ఏనుగులను కూడా తరిమివేయడానికి అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం సానమావు, పోడూరు, పాతకోట, రామాపురం, ఆళ్యాళం, బీర్జేపల్లి, పేరండపల్లి తదితర ప్రాంతాలలో వేల ఎకరాలలో వరి, రాగి పంటలు నూర్పిడి దశలో ఉన్నాయి. ఈ తరుణంలో ఏనుగులు నాశనం చేస్తుండడంతో రైతులు వాటిని తరిమివేయాలని డిమాండ్ చేశారు. 50 మందికి పైగా అటవీ శాఖ సిబ్బంది టపాసులు పేల్చి ఏనుగులను తరిమివేశారు.