న్యూఢిల్లీ : సుదీర్ఘ లాక్ డౌన్ వల్ల కరోనా కు కళ్లెం పడక పోగా ప్రభుత్వం దేశస్థూలోత్పత్తిని నియంత్రించిందని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ‘లాక్డౌన్ ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది. లాక్డౌన్ ను కఠినంగా అమలుచేసినా వైరస్ విజృంభణకు అడ్డు కట్ట పడలేదు. ఆర్థిక వ్యవస్ధ చిక్కుల్లో కూరుకుపోయింది. ప్రభుత్వం ఇన్ఫెక్షన్ గొలుసును తెంచలేదు. ఆర్థిక వ్యవస్థ గమనాన్ని అడ్డుకుంది. కరోనా వైరస్పై పోరులో సమతూకంతో వ్యవహరించిన జపాన్ తరహా దేశాలను మనం అనుసరించకుండా అమెరికా, స్పెయిన్, ఇటలీ వంటి పాశ్చాత్య దేశాలను అనుకరించి నష్ట పోయాం. ఆర్థిక ఇబ్బందులను భరించగలిగిన వారికి మాత్రమే ఇది అనుకూలంగా ఉంది. మన చుట్టూ జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తీపి కన్నా చేదు ఫలితాలే అధికం. వైరస్ పట్ల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొనేలా ప్రచారం సాగింది. ఇప్పుడు వారి ఆలోచనా ధోరణి మార్చడం కష్టమ’ని వ్యాఖ్యానించారు.