టీఆర్ఎస్ ఓడిపోయిందని టీఆర్ఎస్ కార్యకర్త సంబరాలు..

టీఆర్ఎస్ ఓడిపోయిందని టీఆర్ఎస్ కార్యకర్త సంబరాలు..

పార్టీ మేలు కోరే నేతల్ని చూశాం. ప్రతిష్ఠాత్మకమైన ఎన్నికల్లో పార్టీ గెలిస్తే గుండు కొట్టించుకుంటామని.. కాలి నడకన వచ్చి దర్శనం చేసుకుంటామని.. ఇలాంటి మొక్కుల్ని ఇప్పటివరకు విని ఉంటాం. ఇప్పుడు అందుకు భిన్నంగా దుబ్బాక ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోతే 101 కొబ్బరికాయలు కొట్టి మొక్కు తీర్చుకుంటామని కోరుకున్నాడో టీఆర్ఎస్ పార్టీ నేత. అతను కోరుకున్నట్లే దుబ్బాకలో టీఆర్ఎస్ అనూహ్య ఓటమి నేపథ్యంలో.. తాను చెప్పినట్లే మొక్కు తీర్చేసుకున్న వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది.సూర్యాపేట జిల్లా కేంద్రానికి చెందిన గోదాల రంగారెడ్డి. గతంలో టీడీపీకి చెందిన ఈ నేత.. దశాబ్దాల తరబడి రాజకీయాల్లో ఉన్నాడు. గతంలో కౌన్సిలర్ గా పని చేశాడు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన.. స్థానికంగా ఉన్న పార్టీ రాజకీయాలతో విసిగిపోయాడు.తన సతీమణి టీఆర్ఎస్ కౌన్సిలర్ అయినప్పటికీ.. తమను పట్టించుకోకుండా వ్యవహరించే వారిని అస్సలు పట్టించుకోరు. పార్టీ మీద ఉన్న అసహనంతో తాజాగా జరిగిన దుబ్బాక ఎన్నికల్లో పార్టీ తప్పనిసరిగా ఓడిపోవాలని చాలా గట్టిగా కోరుకున్నాడు. అంతేకాదు.. పార్టీ ఓటమిపాలైతే.. 101 కొబ్బరికాయలు కొడతానని తెలంగాణలోని రెండో అతి పెద్దదైన పెద్దగట్టు లింగమంతుల స్వామికి మొక్కకున్నాడు.ఏ ముహుర్తంలో మొక్కుకున్నాడో కానీ.. పైనున్న తథాస్తు దేవతలు తధాస్తు అనటం.. తాజాగా ఓడిపోవటం జరిగిపోయాయి. దీంతో.. తన మొక్కును తీర్చినందుకు సంతోషంగా 101 కొబ్బరికాయలు కొట్టి తన మొక్కు తీర్చుకున్నాడు. ఇతగాడి తీరుకు స్థానిక టీఆర్ఎస్ నేతలు ముక్కున వేలేసుకుంటే.. ఆయన మాత్రం అవేమీ పట్టించుకోకుండా భక్తి శ్రద్ధలతో తన మొక్కు తాను తీర్చుకొని వెళ్లిపోయిన తీరు ఇప్పుడు విస్మయానికి గురి చేస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos