హైదరాబాద్ : ఇంటర్ ఫలితాల్లో ఏర్పడిన గందరగోళం వల్ల బోర్డు కార్యాలయం ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో రాజకీయ నాయకుల నుంచి వారికి మద్దతు లభిస్తోంది. దీనివల్ల అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి, సంపత్, అనిల్ కుమార్ యాదవ్లు కూడా ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద సోమవారం ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అంతకు మునుపు ఏబీవీపీ నాయకులు కూడా ఆందోళనకు దిగగా, పోలీసులు అరెస్టు చేశారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ కార్య నిర్వాహక అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులందరికీ న్యాయం చేయాలన్నారు. ఇంటర్ ఫలితాలపై విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్కు కూడా అనుమతి ఇవ్వకపోవడం దారుణమని విమర్శించారు. ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పిదాలకు విద్యా శాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.