విజయవాడ: భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పోలవరం జలాశయం స్పిల్ వే పై రెండు మీటర్ల మేర నీరు ప్రవహిస్తోంది. కాఫర్ డ్యాం వద్ద వరద 28 మీటర్లకు చేరుకుంది. పోలవరం మండలంలోని 19 గ్రామాలకు వారం రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు ఆ గ్రామాల వారికి పునరావాసం, ఆహారం, మందులు అందిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తి నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. బ్యారేజ్ వద్ద 9.34 లక్షల క్యూసెక్కుల వరద నీరు ఉందని అధికారులు తెలిపారు. ఆనకట్ట వద్ద ప్రస్తుత నీటి మట్టం 11.2 అడుగులు. వశిష్ట, వైనతేయ, గౌతమి నదులు ఉద్దృతంగా ప్రవహిస్తుండటంతో దేవిపట్నం మండలంలోని 26కు పైగా ఏజెన్సీ గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. లంక గ్రామాలను అప్రమత్తం చేసిన అధికారులు ఆ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.