తీరు మారలేదు

న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) నోటీసు అందినప్పటికీ.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న ఆ పార్టీ అగ్రనాయకుల తీరులో మాత్రం మార్పు రావటం లేదు. ముస్లింలకు కాంగ్రెస్ సంపదను తిరిగి పంచుతుందని ఆరోపిస్తూ ప్రధాని మోడీ బహిరంగంగా మతపరమైన వ్యాఖ్యలను చేసిన విషయం విదితమే. ఆ పార్టీ అధ్యక్షుడు జె.పి నడ్డాతో సహా బీజేపీ ఇతర స్టార్ క్యాంపెయినర్లుగా ఉన్న కేంద్ర హౌంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లు ప్రధాని వ్యాఖ్యలను ప్రతిధ్వనిస్తున్నారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఎక్కడా దేశంలో సంపద పునర్విభజన గురించి ప్రస్తావించలేదు. ఉద్యోగాలు, రిజర్వేషన్లు, సచార్ కమిటీ నివేదిక అమలు, ట్రిపుల్ తలాక్ను తిరిగి తీసుకురావటంలోనూ ముస్లింల గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదు. అయితే, ఈసీఐ నుంచి నోటీసు అందినప్పటికీ.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు తప్పుదోవ పట్టించే వాదనలను చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ” ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ల హక్కులను లాక్కొని ముస్లింలకు ఇవ్వాలవని కాంగ్రెస్ కోరుకుంటున్నది” అని మోడీ మతపరమైన వ్యాఖ్యలను ప్రతిధ్వనించేలా జె.పి నడ్డా రెండ్రోజుల క్రితం మాట్లాడారు. ”ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను లాక్కొని ముస్లింలకు ఇవ్వటమే కాంగ్రెస్, ఇండియా కూటమి రహస్య అజెండా. దేశంలోని వనరులపై తొలి హక్కు ముస్లింలకే ఉందని కాంగ్రెస్ చెప్తున్నది. అయితే వనరులపై మొదటి హక్కు ఈ దేశంలోని పేదలదేనని ప్రధాని మోదీ అన్నారు” అని ఆయన అన్నారు.
మోడీలాగే.. నడ్డా కూడా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రసంగాన్ని తప్పుదారి పట్టించారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
రాజస్థాన్లోని బనస్వరాలో జరిగిన ర్యాలీలో మోడీ తొలిసారిగా వ్యాఖ్యలు చేసిన మూడు రోజుల తర్వాత ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ల స్టార్క్యాంపెయినర్ల మోడల్ ప్రవర్తనా నియమావళి(ఎంసీసీ) ఉల్లంఘనలకు వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షులు నడ్డా, మల్లికార్జున్ ఖర్గేలను ఉద్దేశించి లేఖలను పంపింది. ఆ లేఖలు ఉల్లంఘించిన వారి పేర్లను మాత్రం పేర్కొనలేదు.
ఈ నెల 21న బన్స్వారాలో.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ర్యాలీకి హాజరైన వారి తల్లులు, సోదరీమణుల సంపదను ”చొరబాటుదారులు”, ”ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి” పంపిణీ చేస్తుందని ఒక వర్గం వారిని టార్గెట్ చేస్తూ మోడీ అన్నారు. ఆ తర్వాత జరిగిన ర్యాలీల్లోనూ ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేయటం గమనార్హం. ఈ ప్రసంగం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు కారణమైంది. గ్లోబల్ ప్రెస్లో అపూర్వమైన ద్వేషపూరిత ప్రసంగంగా ఇది అభివర్ణించబడింది.
నడ్డా మాత్రమే కాదు.. అమిత్ షా, రాజ్నాథ్తో సహా బీజేపీ ఇతర స్టార్ క్యాంపెయి నర్లు అప్పటి నుంచి మోడీ మతపరమైన విద్వేష వ్యాఖ్యలను ప్రతిధ్వనిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల యూపీలోని దాద్రీలో జరిగిన ర్యాలీలో రాజ్నాథ్ కూడా మన్మోహన్ ప్రసంగాన్ని ప్రస్తావించారని చెప్పారు. ”2006లో, జాతీయ రక్షణ మండలి సమావేశంలో దేశ వనరులపై మొదటి హక్కు మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలదేనని అన్నారు. దేశ వనరులు ప్రతి ఒక్కరికీ చెందుతాయి. ప్రధాని ఈ విషయం చెప్పినప్పుడు వారు (ప్రతిపక్షాలు) హంగామా (రక్కస్) చేస్తున్నారు”అని ఆయన అన్నారు. శుక్రవారం ఛత్తీస్గఢ్లోని బెమెతరలో జరిగిన ర్యాలీలో.. ముస్లిం వ్యక్తిగత చట్టాలను తీసుకు వస్తామనీ, దేశాన్ని ”షరియా చట్టం” ప్రకారం నడుపుతామని కాంగ్రెస్ తన మ్యానిఫెస్టోలో పేర్కొన్నదని అమిత్ షా ఆరోపించారు. ”కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను జాగ్రత్తగా చదవండి. మళ్లీ వ్యక్తిగత చట్టాలు తీసుకువస్తామని ఆ పార్టీ చెప్పింది. ముస్లిం వ్యక్తిగత చట్టాలను తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నారు? షరియా చట్టం ప్రకారం ఈ దేశం నడుస్తుందా? మీరు ట్రిపుల్ తలాక్ను వెనక్కి తీసుకురాగలరా? కాంగ్రెస్ పార్టీ ముస్లిం లీగ్ అజెండాను తీసుకుంటున్నది. కానీ రాహుల్ బాబా మిమ్మల్ని ప్రజలు ఎన్నుకోరు. ట్రిపుల్ తలాక్ను వెనక్కి తీసుకురారు. సీఏఏ, ట్రిపుల్ తలాక్, ఆర్టికల్ 370లను తాకలేరు” అని అమిత్ షా అన్నారు. అదే రోజు జరిగిన మరో ర్యాలీలోనూ ఆయన ఆ వాదనను మళ్లీ వినిపించటం గమనార్హం.
యూపీలోని ఇటావాలో శనివారం జరిగిన ర్యాలీలో కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ)లు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తాయని ఆదిత్యనాథ్ ఊహాజనిత ఆరోపణలు చేశారు. ”వెనుకబడిన కులాలకు 27 శాతం రిజర్వేషన్లలో వారు ముస్లింలను చేర్చుతారు. మీరు దీన్ని అంగీకరి స్తారా? భారత్లో మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవచ్చా? మత ప్రాతిపదికన రిజర్వేషన్లను అంబేద్కర్ వ్యతిరేకించారనీ, ఇప్పుడు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారు” అని యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రజలు తమకు నచ్చినవి తినకుండా ఆపకూడదని సూచించడం ద్వారా ఆవులను వధించడాన్ని సూచిస్తున్నదనీ, అది విశ్వాసాలతో ఆడుకోవటమేనని ఆయన అన్నారు. బీజేపీ నాయకుల వ్యాఖ్యలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నదనీ, ఇది ఇలాగే కొనసాగితే ఎన్నికల్లో ఆ పార్టీకే నష్టమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

తాజా సమాచారం