నందమూరి అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. అలనాటి నటుడు ఎన్టీ రామారావు జీవితాధారంగా తెరకెక్కిన ‘యన్టిఆర్: కథానాయకుడు’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. కాగా.. అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా ప్రీమియర్ షోను మంగళవారం ప్రదర్శించారు. నిన్నటి నుంచి ఈరోజు ఉదయం వరకు వేసిన షోలతో ‘యన్టిఆర్’ చిత్రం 4,40,000 డాలర్లు (రూ. 3,09,87,000) రాబట్టినట్లు సినీ విశ్లేషకులు సోషల్మీడియా ద్వారా వెల్లడించారు. బాలయ్య నటించిన ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రీమియర్ షో వసూళ్లను ‘యన్టిఆర్’ చిత్రం బీట్ చేసిందని అంటున్నారు. అమెరికాలో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ ప్రీమియర్ షో ద్వారా తొలి రోజు 3,75,000 డాలర్లు (రూ.2, 64,14,812) వసూళ్లు రాబట్టింది. ‘యన్టిఆర్’ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ‘యన్టిఆర్: కథానాయకుడు’, ‘యన్టిఆర్: మహానాయకుడు’గా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది. ‘యన్టిఆర్: మహానాయకుడు’ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.