హైదరాబాద్ : ఎన్టీఆర్ ఘాట్ వద్ద మంగళవారం కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి నివాళులర్పించడానికి వచ్చారు. ఘాట్ వద్ద కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. కనీసం ఒక్క బ్యానర్ కూడా కట్టలేదని వాపోయారు. చంద్రబాబు చేసిన అన్యాయాలు, కుట్రల వల్ల ఎన్నికల్లో ఆయనకు తగిన శాస్తి జరిగిందని శాపనార్థాలు పెట్టారు. అక్కడున్న తెదేపా నాయకులు, కార్యకర్తలు రాజకీయాలు మాట్లాడవద్దంటూ ఆమె ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు చంద్రబాబుకు అనుకూలంగా, లక్ష్మీ పార్వతికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్టీఆర్ ఘాట్ను తెరాస ప్రభుత్వం అలంకరించలేదంటూ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.