ఢిల్లీ : కార్ల ఉత్పత్తిలో దేశంలోనే పెద్ద సంస్థ మారుతీ సుజుకీ డీజిల్ వెర్షన్ కార్ల ఉత్పత్తికి స్వస్తి పలకనుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి తమ అన్ని మోడళ్లలోని డీజిల్ కార్లను అమ్మేది లేదని సంస్థ ఇండియా చైర్మన్ ఆర్సీ. భార్గవ గురువారం తెలిపారు. ప్రస్తుతం ఈ సంస్థ విక్రయిస్తున్న కార్లలో డీజిల్ కార్ల వాటా సుమారు 23 శాతం. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి బీఎస్-6 తరహా వాహనాలు మార్కెట్లో ప్రవేశించబోతున్నాయి. ఈ సాంకేతికత వల్ల డీజిల్ వేరియెంట్ కార్ల ఉత్పాదన ఖర్చు బాగా పెరుగుతుందని భార్గవ తెలిపారు. కనుక ఈ తరహా కార్ల ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని, అంత మొత్తాన్ని వినియోగదారులు భరించలేకపోవచ్చని వివరణ ఇచ్చారు. అందుకనే డీజిల్ కార్ల ఉత్పత్తిని మానుకోవాలని నిర్ణయించామన్నారు. కాగా ఖరీదైన కార్ల కేటగిరిలో మాత్రం డీజిల్ వేరియెంట్ను కొనసాగించే అవకాశాలున్నాయి.