హైదరాబాదు: తెలంగాణ ప్రభుత్వం కూడా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్ శనివారం ఇక్కడ ఆరోపించారు. మానవ హక్కుల నేతలతో పాటు ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులపై పెగాసస్ను వాడుతున్నారని ఆరోపించారు. ప్రజల తరఫున పోరాడే వారి గోప్యతా హక్కుకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రభుత్వం పాల్పడుతోన్న ఇటువంటి చర్యలకు వ్యతిరేకంగా అందరూ కలిసి పోరాడాలని పిలుపు నిచ్చారు. ఇజ్రాయెల్ కు చెందిన స్పైవేర్ ‘పెగాసస్’ సాయంతో కేంద్ర ప్రభుత్వం భారత్ లోని పలువురు ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టుల ఫోన్లపై నిఘా ఉంచినట్లు వస్తోన్న కథనాలు దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే.