అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు ముసాయిదాల పై గురించి గవర్నర్ ప్రజాభిప్రాయాన్ని, న్యాయ సలహా తీసుకోవాలని తెదేపా నేత యనమల సలహా ఇచ్చినందుకు మంత్రి కన్నబాబు మండి పడ్డారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు.‘ యనమలకు తెలిసిందల్లా ఒక్కటే ప్రయోజనాల్ని కాపాడుకోవటం. యనమల ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడడం ఆశ్చర్యం . రాజ్యాంగంలోని 197 (2) అధీకరణ ప్రకారం మండలిలో రెండో సారి ముసాయిదాల్ని బిల్లులు ప్రవేశపెట్టిన నెలరోజుల తర్వాత అవి ఆటోమేటిగ్గా ఆమోదం పొందుతాయన్నది యనమలకు తెలియదా? ఏనాడూ రాజ్యాంగాన్ని పాటించని వ్యక్తి యనమల. నాడు ఎన్టీఆర్ కు దిగువ సభలో మాట్లాడేందుకు మైక్ ఇవ్వని వ్యక్తి. ఇప్పటి వరకు చంద్రబాబును కాపాడేందుకు తపన పడే మనిషి. అమరావతిపై మీ ప్రేమ ఏంటో ప్రజలందరికీ అర్థమైంది. మీ నేతల బినామీ భూములను, మీ నాయకుల ఆస్తులను, కాపాడుకునేందుకే కదా మీ ప్రేమ!గత ఐదేళ్లలో మీరు అమరావతికి చేసింది ఏమిటి? భూములు బలవంతంగా లాక్కున్నారు. కనీసం ఆ భూములిచ్చిన వాళ్లకు తిరిగి ప్లాట్లు కూడా ఇవ్వలేదు. బాబు మహా నగరం గురించి మాట్లాడుతున్నారు. 54 వేల మంది పేదలకు అమరావతిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే తెదేపా నేతలకు ఎందుకు కడుపుమంట? ఏం, అమరావతిలో బడుగు, బలహీన వర్గాల పేదలు ఉండడానికి లేదా’ని ధ్వజమెత్తారు.