హోసూరు : కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ హోసూరులో తమిళనాడు వ్యవసాయ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. తమిళనాడు వ్యవసాయ సంఘం హోసూరు శాఖ అధ్యక్షుడు శ్రీరాంరెడ్డి అధ్యక్షతన హోసూరు సమీపంలోని మత్తిగిరి క్యాటిల్ ఫామ్ వద్ద ఈ ఆందోళనను నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంరెడ్డి మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తుండగా, ఆ పథకాన్ని రద్దు చేసే దిశగా అడుగులు పడుతోందని ఆరోపించారు. లాక్డౌన్ కారణంగా మూతపడిన పరిశ్రమలకు కరెంటు బిల్లులతో పాటు రూ.1,500 కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం, అన్నం పెట్టే రైతన్నకు అన్యాయం చేస్తున్నదని ఆయన మండిపడ్డారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు చేసిందేమీలేదని విమర్శించారు. దేశంలోని కార్పొరేట్ సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తూ, వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. రైతులకు అన్యాయం చేసిన ఏ ప్రభుత్వాలు బతికి బట్ట కట్టలేదని హెచ్చరించారు. తమిళనాడులో రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ పథకాన్ని రద్దు చేస్తే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు.