గుంటూరు : ప్రజల ద్వంద్వ వైఖరి వామ పక్షాల పురోగతికి అవరోధంగా మారిందని సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ ఆయన విలేఖరులతో మాట్లాడారు. ప్రజలు ఆర్థిక పోరాటాలకు ఎర్రజెండా వైపు, ఓటు కోసం వేరే జెండా చూస్తున్నారని ఆక్రోశించారు. కాలానుగుణంగా వామ పక్షాలు మారాల్సి ఉందన్నారు. యువతను వామపక్ష వైపు మళ్లించలేక పోతున్నామని అంగీకరించారు. వీటి అన్నింటిపైనా లోతైన సమీక్ష జరగాల్సి ఉందనన్నారు. ప్రజా ఉద్యమాలను బలపర్చాల్సిన అవసరం ఉందంటూ పార్లమెంట్లో వామ పక్షాల సంఖ్యా బలం 60 నుంచి ఐదుకు పడిపోయింద న్నారు. మూడో పెద్ద జాతీయ పార్టీగా ఉన్న సీపీఎం 16వ స్థానానికి దిగిందని చెప్పారు. వామపక్ష ఉద్యమాల నేతలకు నాయకత్వ సమర్ధత లోపిస్తోందని అంగీకరించారు. గత ఎన్నికల్లో ధన ప్రవాహం వల్లే భాజపా గెలిచిందని విమర్శించారు. తలాఖ్ ద్వారా ముస్లిం మహిళలకు సమానత్వం ఇచ్చామని చెప్పుకుంటున్న భాజపా హిందూ మహిళలకు ఎందుకు సమానత్వం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. శబరిమలై దేవాలయంలోకి మహిళలను ఎందుకు అనుమతించరని అడిగారు .బంగలో గతంలో ఎన్నడూ లేని విధంగా మత కలహాలు జరుగుతున్నాయని ఆక్రోశించారు. జై శ్రీరాం అనని వారిని చంపేస్తున్నారని దుయ్యబట్టారు. హిందు ఉగ్రవాదం పెచ్చు పెరిగి పోతోందని హెచ్చరించారు.