హైదరాబాదు: రాజకీయాల్లో మోసం చేసేవాళ్లు ఉంటారు.. మోసపోయేవాళ్లు ఉంటారని తెలంగాణ రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం ఇక్కడ మాధ్యమ ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. మునుగోడులో బీజేపీని ఓడించేందుకే తాము బీఆర్ఎస్కు మద్దతిచ్చామన్నారు. ‘కలిసి ఉందామని కేసీఆర్ చెప్పారని, కానీ ఆ తర్వాత ఇప్పుడు లెక్క ఎందుకు మారిందో ఆయనే చెప్పాలి. మునుగోడులో మద్దతివ్వడం మా తప్పు కాదు. కేసీఆర్ను మేము నమ్మడం కాదు. ఆయన తమను అవసరానికి మమ్మల్ని వాడుకున్నాడు. కేసీఆర్ మాతో రెండుమూడుసార్లు మాట్లాడారు. కానీ సీట్ల ప్రకటన సమయంలో కనీసం సమాచారం ఇవ్వలేద’ని విమర్శించారు. సీపీఎం, సీపీఐ.. రెండు కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాయన్నారు. తమతో ఎవరైనా కలిసి వస్తే పోటీకి సిద్ధమన్నారు. లేదంటే కమ్యూనిస్టులం కలిసి వెళ్తామన్నారు. రానున్న ఎన్నికల్లో మాత్రం వామపక్షాలు కలిసి ముందుకు సాగుతాయన్నారు. పొత్తుల కోసం తాము ఎప్పుడూ వెంపర్లాడలేదని తేల్చి చెప్పారు.