ఎన్టీఆర్ సినిమా చూసిన మంత్రులు

అమరావతి: నందమూరి తారకరాముడి జీవిత చరిత్రను ‘యన్‌.టి.ఆర్‌- కథానాయకుడు’ చిత్రం కళ్లకు కట్టిందని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, నారాయణ కొనియాడారు. నెల్లూరు ఎస్‌-2 థియేటర్‌లో సినిమాను వీక్షించారు. ఎన్టీఆర్‌తో తమకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. ప్రతి తెలుగువాడూ తప్పక చూడాల్సిన సినిమా ‘యన్‌.టి.ఆర్‌’ అని విజయవాడ ఎంపీ కేశినేని నాని తెలిపారు. విజయవాడ కాపిటల్‌ మూవీస్‌లో తెదేపా నేతలతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని చూశారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో పట్టణ ప్రజలతో కలిసి గంగా మహల్‌ థియేటర్‌లో ‘యన్‌.టి.ఆర్‌’ చిత్రాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తన కుమారుడు నిఖిల్‌తో కలిసి వీక్షించారు. అనంతరం ఎన్టీఆర్‌ చిన్నప్పటి నుంచి పడిన కష్టాలు, రాజకీయ రంగప్రవేశం గురించి ప్రముఖ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ సినిమాలో తన నటన ద్వారా చక్కగా చూపించారని కొనియాడారు. బాలకృష్ణను చూస్తుంటే ఎన్టీఆర్‌ను చూస్తున్నట్లు ఉందని తెలిపారు. అనంతరం ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. పైరసీని అరికట్టాలని , థియేటర్‌కు వెళ్లి మాత్రమే సినిమా చూడాలని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. ‘యన్‌.టి.ఆర్‌’ సినిమా విడుదల సందర్భంగా నందమూరి బాలకృష్ణ అభిమానులు సందడి చేశారు. చిత్రం బాగుందంటూ కేరింతలు కొట్టారు. యన్‌.టి.ఆర్‌ విడుదల సందర్భంగా విశాఖలో అభిమానుల సందడి అంబరాన్ని తాకింది. ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos