హైదరాబాద్ : కరీంనగర్లో కరోనా పాజిటివ్ కేసుల దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 కరోనా పాజిటివ్ కేసులు గుర్తించినట్లు స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం ప్రగతిభవన్లో మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. మార్చి1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారి వివరాలను రానున్న రెండు మూడు రోజుల్లో గుర్తించాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించినట్లు చెప్పారు. థియేటర్లు, మాల్స్ మూసివేతను వారం రోజులుగా నిర్ణయించినా, దానిని మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని మతాలకు చెందిన ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించవద్దని ఆదేశాలిచ్చామన్నారు. వీలైనంత వరకు విదేశాల నుంచి వచ్చిన వారే స్వయంగా ప్రభుత్వ అధికారులకు సమాచారాన్ని అందించాలని కోరారు. స్వచ్ఛందంగా క్వారంటైన్లకు తరలివెళ్లాలని సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ దృష్ట్యా ఉగాది, శ్రీరామ నవమి ఉత్సవాలను రద్దు చేశామన్నారు. పంచాంగ శ్రవణం ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.