హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి కుటుంబాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం పరామర్శించారు. అనారోగ్యంతో ఇటీవల జైపాల్ రెడ్డి మరణించారు. జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లిన చంద్రబాబు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డితో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రజా సమస్యలపై ఆయన రాజీ లేని పోరాటం చేశారని శ్లాఘించారు. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినప్పుడు ఉద్యమాన్ని నడిపించారని గుర్తు చేసుకున్నారు. ఏ విషయమైనా ఆయన ముక్కుసూటిగా మాట్లాడేవారని అన్నారు. చంద్రబాబు వెంట తెదేపా నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎల్. రమణ ప్రభృతులు ఉన్నారు.