వాషింగ్టన్: పౌరసత్వ సవరణ చట్ట సవరణ ముసాయిదా పట్ల అమెరికాకు చెందిన అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (ఫెడరల్ యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడం) తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. తప్పుడు మార్గంలో ప్రమాదకరమైన మలుపుగా దీన్ని అభివర్ణించింది. లోక్ సభలో ఈ ముసాయిదా ఆమోదం పొందడం కలవరపరుస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది. రాజ్యసభలో ముసాయిదా ఆమోదాన్ని పొందితే కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు, ఇతర కీలక నేతలపై ఆంక్షలు విధించాలంటూ అమెరికా ప్రభుత్వానికి సూచించింది. లోక్ సభలో అమిత్ షా ప్రవేశపెట్టిన బిల్లు పూర్తిగా మతపరమైనదని కమిషన్ వ్యాఖ్యానించింది. పాకిస్థాన్, బాంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ దేశాల నుంచి వలస వచ్చి మన దేశంలో ఆశ్రయం పొందుతున్న హిందవులు, సిక్కులు, బౌద్దులు, జైనులు, క్రైస్తవులు, పార్సీలకు భారత పౌరసత్వం కల్పించటం ఈ ముసాయిదా లక్ష్యం. దీని ప్రకారం 2014 డిసెంబర్ 31కి ముందు మన దేశంలోకి వచ్చిన వారిని అక్రమ వలసదారులుగా గుర్తించరు. వారికి పౌరసత్వం కల్పించి భారతీయ పౌరులుగా గుర్తిస్తారు. ఇది మత వివక్షను సూచిస్తోందని కొన్ని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి.