కొద్ది సంవత్సరాల క్రితం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అంగరాక గ్రహంపైకి విజయవంతంగా ప్రయోగించిన మామ్ రాకెట్ ప్రయోగం ఆధారంగా బాలీవుడ్ హీరో అక్షయ్కుమార్, విద్యాబాలన్, నిత్యమేనన్,తాప్సీ ప్రధాన తాగారణంగా తెరకెక్కిన మిషన్ మంగళ్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్ట్ 15వ తేదీన విడుదల కానుంది.ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది.ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఓ ప్రెస్మీట్లో అక్షయ్కుమార్ చేసిన పని ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ఓ విలేకరి అక్షయ్ అండ్ టీం మాటలను రికార్డ్ చేయాలని తన ఫోన్ను వారి ముందు పెట్టాడు. అయితే దాన్ని సైలెంట్లో పెట్టడం మర్చిపోయాడు. ఇక సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన కీర్తి కుల్హరీ మాట్లాడుతుండగా విలేకరి ఫోన్ ఒక్కసారిగా మోగింది.వెంటనే అక్షయ్ కుమార్ ఫోన్ తీసుకుని ‘హలో.. కృష్ణా జీ, నేను అక్షయ్ను మాట్లాడుతున్నాను. మేం విలేకరులు సమావేశంలో ఉన్నాం. ఇది పూర్తయ్యాక నేను ఫోన్ చేస్తాను’ అని మాట్లాడి ఫోన్ కట్ చేశారు. అక్షయ్ చేసిన పనికి అక్కడున్న వారందరూ ఒక్కనిమిషం ఆశ్చర్యపోయినా తర్వాత తేరుకుని నవ్వుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది..