పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు,నిరసనలు ఉధృతంగా జరుగుతున్న సమయంమలోనే కేంద్ర ప్రభుత్వం జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)కు సిద్ధమవడంపై మరింత ఆగ్రహావేశాలు,నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జనాభా లెక్కల సేకరణ-2021లో సేకరించే వివరాల్లో భాగంగా స్మార్ట్ ఫోన్,గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్స్,మొబైల్ నంబర్ వంటి వివరాలను కూడా సేకరించనున్నారు. జనాభా లెక్కల్లో ఈ రకమైన వివరాలను సేకరించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. జనాభా లెక్కలకు సంబంధించిన కమ్యూనికేషన్ వివరాల కోసం మాత్రమే సెల్ ఫోన్ నంబర్ అడుగుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. ఈసారి జనాభా లెక్కల వివరాల్లో బ్యాంకింగ్కి సంబంధించిన ప్రశ్నలను తొలగించిన కేంద్ర ప్రభుత్వం దానిస్థానంలో ఇంట్లో ధాన్యం వినియోగానికి సంబంధించిన వివరాలను సేకరించడానికి నిర్ణయించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో జనాభా లెక్కలను సేకరించనున్నారు. అదే సమయంలో ఎన్పీఆర్ కూడా అప్డేట్ చేయనున్నారు.జనాభా లెక్కల సేకరణ,ఎన్పీఆర్కి సంబంధించి హోం మంత్రిత్వ శాఖ రిజిస్ట్రార్ జనరల్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం జనాభా లెక్కల కోసం మొత్తం 31 అంశాలకు సంబంధించిన వివరాలను పౌరుల నుంచి సేకరించనున్నారు.