న్యూఢిల్లీ : తాత్కాలిక సిబిఐ డైరెక్టర్గా నాగేశ్వరరావును నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారించే బెంచ్ నుండి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.కెసిక్రీ కూడా స్వయంగా వైదొలిగారు. తదుపరి సిబిఐ డైరెక్టర్ ఎంపిక చేయనున్న అత్యున్నత కమిటీలో ఉన్నందు వల్ల గత విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి రంజన్గోగోయ్ బెంచ్ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్యానల్ నుండి చీఫ్ జస్టిస్ తప్పుకోగా, సిక్రీ వచ్చి చేరారు. గత సిబిఐ డైరెక్టర్ అలోక్వర్మ సెలవులపై పంపిన అనంతరం నాగేశ్వరరావు తాత్కాలిక డైరెక్టర్గా నియమితులయ్యారు. అనంతరం సుప్రీం ఆదేశాల మేరకు అలోక్ తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటికీ, రెండు రోజుల అనంతరం ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత కమిటీ ఆయనను అగ్నిమాపక సేవలకు బదిలీ చేసిన సంగతి విదితమే. ఈ కేసు నుండి సిక్రీ వైదొలగడం తప్పుడు సందేశాన్ని పంపిందని కామన్కాజ్ పిటిషన్ తరుపున వాదిస్తున్న న్యాయవాది దుష్యంత్ దావే అన్నారు. తనకు ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసునని, పిటిషన్లో పలు ముఖ్యమైన అంశాలున్నాయన్న విషయం కూడా తెలుసునని పేర్కొంటూ ఈ బెంచ్ నుండి వైదొలుగుతున్నట్లు సిక్రి సమాధానమిచ్చారు.