వాషింగ్టన్: అమెరికాలో షట్డౌన్ ముగిసిన తర్వాతే కాంగ్రెస్లోని ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తానని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తన వార్షిక కార్యక్రమమైన ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్’ను వాయిదా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ (డెమోక్రాట్) యూఎస్ కాంగ్రెస్లో ట్రంప్ వార్షిక ప్రసంగానికి అవకాశం ఇవ్వకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. షట్డౌన్ కొనసాగుతున్నందున ప్రసంగాన్ని వాయిదా వేసుకోవాలని పెలోసీ తెలిపారు. దీంతో ట్రంప్ షట్డౌన్ ముగిసే వరకు వేచి ఉంటానని చెప్పారు.‘షట్డౌన్ కొనసాగుతుండగా ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్’ చేయమని నాన్సీ పెలోసీ కోరారు. నేనూ అంగీకరించాను. కానీ షట్డౌన్ కారణంగా ఆమె మనసు మార్చుకున్నారు. ప్రసంగాన్ని మరో తేదీకి మార్చుకోవాలని సూచించారు’ అని ట్రంప్ ట్వీట్ చేశారు. అమెరికాలో షట్డౌన్ ముగిసిన తర్వాతే ప్రసంగిస్తానని స్పష్టంచేశారు. అలాగే తాను మరో వేదిక కోసం ప్రయత్నించడం లేదని చెప్పారు. చరిత్ర, సంప్రదాయం, హౌస్ ఛాంబర్ ప్రాధాన్యతతో ఎవ్వరూ పోటీ పడలేరని అన్నారు. త్వరలో గొప్ప ప్రసంగం చేయడానికి ఎదురు చూస్తున్నానని తెలిపారు.స్పీకర్ నాన్సీ పెలోసీ ట్రంప్ ప్రసంగానికి అడ్డు చెప్పడంతో తొలుత ట్రంప్ మరో వేదికను ఎంచుకుని ‘స్టేట్ ఆఫ్ ది యూనియన్ అడ్రస్’ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. మెక్సికోతో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధుల విషయంలో ట్రంప్, డెమోక్రాట్ల మధ్యఅభిప్రాయ భేదాలు తలెత్తాయి. దీంతో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందక అమెరికాలో పాక్షిక షట్డౌన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీలు షట్డౌన్ను ముగించేందుకు చర్చలు జరుపుతున్నాయి.