తియ్య తియ్యగా, పుల్ల పుల్లగా ఉండే పైనాపిల్ పండ్లను చాలా మంది ఇష్టంగానే తింటుంటారు. కొందరు వీటిని నేరుగా పండ్ల రూపంలో తీసుకుంటే కొందరు మాత్రం జ్యూస్ లా చేసుకుని తాగుతారు. అయితే ఎలా తీసుకున్నా పైనాపిల్ పండ్లను తింటే మనకు అనేక ఆరోగ్యకర ప్రయోజనాలే కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక కప్పు పైనాపిల్ ముక్కలు తీసుకుంటే మనకు రోజు మొత్తంలో అవసరమైన విటమిన్ సి లభిస్తుంది. దీంతో రోగనిరోధకశక్తి బాగా పెరుగుతుంది. కణజాలం వృద్ధి చెందటానికీ, కణాల మరమ్మత్తులోనూ విటమిన్ సి కీలకపాత్ర పోషిస్తుంది. 2. పైనాపిల్ పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలకు త్వరగా వృద్ధాప్యం రాకుండా చేస్తాయి. అలాగే క్యాన్సర్, గుండెజబ్బు వంటి జబ్బులు దరి చేరకుండా చూస్తాయి. 3. పైనాపిల్ పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే బరువు తగ్గవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే వ్యాయామం చేసే వారు నిత్యం పైనాపిల్ పండ్లను తింటే శక్తి బాగా అంది దేహధారుడ్యం లభిస్తుంది. 4. పైనాపిల్తో కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలూ దూరమవుతాయి. దీనిలోని బ్రొమెలనిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్లు బాగా జీర్ణం కావటానికి తోడ్పడతుంది. ఇక దీనిలోని పీచు కడుపు నిండిన భావనను కలిగించి, ఎక్కువ ఆహారం తినకుండా చూస్తుంది. అలాగే మలబద్ధకం దరి చేరకుండా కాపాడుతుంది.5. పైనాపిల్లో మాంగనీస్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఒక కప్పు పైనాపిల్ ముక్కలతో మన శరీరానికి రోజుకు అవసరమైనంత మాంగనీస్ లభిస్తుంది. ఇది విటమిన్ సితో కలిసి చర్మం నిగనిగలాడేలా చేస్తుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల నుంచి చర్మ కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది.