దిల్లీ: ఎన్నికల్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)లను హ్యాకింగ్ చేయొచ్చని, 2014 ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ సైబర్ నిపుణుడిగా చెప్పుకున్న సయ్యద్ షుజా ఇటీవల చేసిన ఆరోపణలు రాజకీయ దుమారానికి దారితీశాయి. దీంతో వచ్చే ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లే వాడలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తిరిగి పేపర్ బ్యాలెట్లకు వెళ్లే ప్రసక్తే లేదని, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలనే ఉపయోగిస్తామని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునిల్ అరోరా స్పష్టం చేశారు.దిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సునిల్ అరోరా తాజా వివాదం గురించి స్పందించారు. ‘తిరిగి కాగితం బ్యాలెట్ల రోజులకు వెళ్లే ప్రసక్తే లేదు. మేం ఈవీఎంలనే కొనసాగిస్తాం. 2014 నుంచి ఇప్పటివరకు అనేక ఎన్నికలు జరిగాయి. కొందరు గెలిచారు. కొందరు ఓడిపోయారు. గెలిచిన వారికి ఈవీఎంలు మంచివే. ఓడిపోయిన వారు అవి సరిగా లేవని అంటారు. ఈవీఎంలేం ఫుట్బాల్ కాదు. దేశంలో రెండు దశబ్దాలుగా ఈవీఎంలను ఉపయోగిస్తున్నాం. రాజకీయ పార్టీల డిమాండ్ల దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీవీప్యాట్ యంత్రాలను కూడా తీసుకొచ్చాం’ అని సునిల్ అరోరా చెప్పుకొచ్చారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంలనే కొనసాగిస్తామని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఈవీఎంలపై ఎలాంటి విమర్శలు, వివాదాలను ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు.