ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి అధినేత ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోవటానికి సిద్దంగా లేరు. ప్రత్యేక హోదా లో యూ టర్న్ తీసుకున్నారనే ప్రచారం ఎన్నికల్లె ఎఫెక్ట్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు. ప్రత్యేక హోదా పై తామే తొలి నుండి పోరాడామని చెబుతున్న వైసిపిని ఆత్మరక్షణ లోకి నెట్టటమే తాజా లక్ష్యం. ఇక, పవన్ తమకు అనుకూలం కాక పోయినా..వ్యతిరేకం కాకుండా న్యూట్రల్గా మార్చుకోవటమే ఇప్పుడు టిడిపి వ్యూహంగా కనిపిస్తోంది. ఇందు కోసం హోదా పేరుతో మొదలు పెట్టిన క్రెడిట్ గేమ్ ను వైసిపి తిప్పి కొట్టగలదా…పవన్ ఏం చేయబోతున్నారు..
పవన్ ను ఆకట్టుకొనేందుకు ఇలా..
వచ్చే ఎన్నికల్లో పవన్ తమతో నేరుగా పొత్తు పెట్టుకోవటానికి సిద్దంగా లేరని టిడిపి గుర్తించింది. అయితే, గత ఎన్నిక ల్లో తమకు అనుకూలంగా వ్యవహరించిన పవన్..ఇప్పుడు వ్యతిరేకంగా ఉంటే ఎంతో కొంత నష్టం తప్పదని టిడిపి నేతల అంచనా. దీంతో…వపన్ సూచనలను గౌరవం ఇస్తున్నట్లుగా వ్యవహరిస్తూ…పవన్ ను ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజకీయాలకతీతంగా అన్ని పార్టీలు ఏకమై ఒకే గొంతుకను వినిపిద్దా మని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హోదా సాధన కోసం చివరి అస్త్రంగా గట్టిగా ఉద్యమిద్దామని, దీనికి అన్ని రాజకీయ పక్షాలు కలిసి రావాలని గుంటూరులో ఆదివారం నిర్వహించిన జనసేన శంఖా రావం సభా వేదికగా పిలుపునిచ్చారు. దీనికి స్పందనగా అన్నట్లుగా టిడిపి ఉండవల్లి నిర్వహించే సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించింది. వైసిపి ఈ సమావేశానికి రాకపోవటం ద్వారా వారిని ఎండగట్టవచ్చని మరో వ్యూహం.
టార్గెట్ జగన్ ..ఇలా ఇక,
ఇదే సమయంలో ప్రత్యేక హోదా విషయంలో అఖిలపక్ష సమావేశం ఉండవల్లి ఒకటి ఏర్పాటు చేస్తుంటే..మరుస టి రోజు ముఖ్యమంత్రి మరో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఉండవల్లి ఏర్పాటు చేసే సమావేశానికి హాజరయ్యే నేతలకు అక్కడే ఆహ్వానం పలకటంతో పాటుగా..అన్ని రాజకీయా పక్షాలకు ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానాలను పంపనుంది. గతంలో నిర్వహించిన రెండు అఖిలపక్ష సమావేశాలకు వైసిపి – జనసేన హాజర కాలేదు. అయితే, ఈ సారి ఉండవల్లి సమావేశానికి నేరుగా పవన్ వస్తుండటంతో..తాము సైతం అఖిలపక్షం నిర్వహిస్తే పవన్ వస్తారని టిడిపి అంచనా. ఇదే సమయంలో తాము ఆహ్వానించినా వైసిపి రాదనే అంచనాలో టిడిపి ఉంది. దీని ద్వారా ప్రత్యేక హోదా విషయంలో జగన్ ను లక్ష్యంగా చేసుకోవచ్చన్నది టిడిపి వ్యూహం. పవన్ తో పాటుగా ఇతర పార్టీలు.. ప్రజా సంఘాలు సైతం ఈ విషయంలో జగన్ ను లక్ష్యంగా చేసుకుంటారని..అది రాజకీయంగా తమకు కలిసి వస్తుంద నే భావనలో టిడిపి నేతలు ఉన్నారు.
కలిసి వస్తే పవన్ తో సహా..ఢిల్లీకి
ప్రత్యేక హోదా విషయంలో జగన్ కు క్రెడిట్ రాకుండా పూర్తిగా ఆ ఇమేజ్ తమకే రావాలని టిడిపి వ్యూహాలు సిద్దం చేస్తోంది. అందులో భాగంగా అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వం కొన్ని ప్రతిపాదనలు ముందుంచుతోంది. ఫిబ్రవరి 1 న ప్రజా సంఘాలు నిర్వహించే ఏపి బంద్కు మద్దుతు ప్రకటించనున్నారు. ఇప్పటికే టిడిపి పార్టీ పరంగా మద్దతు ఇ స్తున్నట్లు ప్రకటించింది. ఇక, పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే అఖిలపక్ష నేతలను ఢిల్లీ కి తీసు కెళ్లాలని మరో ఆలోచన. దీనికి సైతం జగన్ దూరంగా ఉంటారని భావిస్తున్నారు. ఇక, ముఖ్యమంత్రి ఢిల్లీలో దీక్ష చేసే సమయంలో అన్ని పార్టీలు అందులో పాల్గొనాలని ముఖ్యమంత్రి ఆహ్వానిస్తారని సమాచారం. ఇందులో ప్రజా సంఘా ల తో పాటుగా జనసేన సైతం మద్దతుగా నిలవాలని టిడిపి కోరుకుంటోంది. దీని ద్వారా హోదా అంశంలో జగన్ ను ఒంటరి చేయాలని.. పూర్తిగా క్రెడిట్ దక్కించుకోవాలనేది టిడిపి వ్యూహం. మరి..ఇది ఎంత వరకు వర్కవుట్ అవుతుం దో చూడాలి. పవన్ – జగన్ లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.