హైదరాబాద్ : వివాదంలో చిక్కుకున్న టీవీ9 సీఈఓ రవి ప్రకాష్ను ఆ పదవి నుంచి తొలగించినట్లు కంపెనీ యాజమాన్యం ప్రకటించింది. సైబరాబాద్ పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు రవి ప్రకాశ్ కంపెనీ డేటాను బయటకు చేరవేశాడనే అనుమానాలున్నాయి. తదనంతరం టీవీ9 ఆఫీసులో పోలీసులు 12 హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకున్నారు. సాయంత్రం రవి ప్రకాష్ ఇంటికి వెళ్లిన పోలీసు బృందం ఆయన భార్యకు 160 సీఆర్పీసీ కింద నోటీసులు అందజేశారు. శుక్రవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. నటుడు శివాజీకి కూడా పోలీసులు నోటీసులు అందజేశారు సైబర్ క్రైమ్ పోలీసులు ఏడు బృందాలుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. కాగా టీవీ9లో కేవలం ఎనిమిది శాతం వాటాలున్న రవి ప్రకాష్ 90 శాతానికి పైగా వాటా ఉన్న కొత్త యాజమాన్యాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణలున్నాయి. సంస్థ ఉద్యోగి కౌశిక్ రావు సంతకం ఫోర్జరీ చేశారనే ఆరోపణలు కూడా రావడంతో రవి ప్రకాష్ను సంస్థ నుంచి బయటకు పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.