హైదరాబాదు: తెరాస పార్టీకి రాజీనామా చేసిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఆ పార్టీకి షాకిచ్చారు. త్వరలో బీజేపీలో చేరే అవకాశ కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ పంపిన రాజీనామా లేఖలో టీఆర్ ఎస్, కేసీఆర్ తీరుపై విరుచుకు పడ్డారు. ‘ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీలో అనేక అవమానాలు ఎదుర్కొన్నాను, కేసీఆర్ అంటే అభిమానం, కృతజ్ఞతతో ఇప్పటిదాకా పార్టీలో ఉన్నా. అభిమానానికి, బానిసత్వానికి చాలా తేడా ఉంటుంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో నా అవసరం పార్టీకి లేదని తెలిసింది. మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఒక మాజీ ఎంపీ అయిన నన్ను ఒక్క సారి కూడా సంప్రదించ లేదు. నియోజకవర్గంలో జరిగిన ఆత్మగౌరవ సభలలో, ఉద్దేశపూర్వకంగా సమాచారం ఇవ్వకున్నా అవమానాన్ని దిగమింగి ఉన్నా. అది మీకు తెలిసి కూడా మౌనంగా ఉన్నారు. మునుగోడు టికెట్ అసలు నాకు సమస్యనే కాదు. నీ బీసీ సామజిక వర్గానికి టిక్కెట్ పరిశీలించండి అని అడగటం కూడా నేరమే అయితే అసలు ఈ పార్టీలో ఉండటమే అనవసరం . రాజకీయ వెట్టి చాకిరీని తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం భరించలేరు. నేను వ్యక్తిగతంగా అవమాన పడ్డా, అవకాశాలు రాకున్నా పర్వాలేదు. పదవుల కొరకు, పైరవీలు చేసే వ్యక్తిత్వం కాదని తెలిసి కూడా, మీరు కనీసం కలిసి ప్రజల సమస్యలు విన్నవించుకునే అవకాశం కూడా కల్పించలేదు. బడుగు బలహీన వర్గాలు సమస్యలను నేను పదే పదే ప్రస్తావించడం, దానిపై మీరు నా పై అసహనం వ్యక్తం చేయడం ఒక ఉద్యమ కారుడిగా ఎంతో బాధించింది. తెలంగాణ ఉద్యమంలో రోజులు, నెలలు, ఏండ్లు గడిపిన మీ సన్నిహితులు, సహచర ఉద్యమకారులు కనీసం ఒక నిముషం మీతో కలవాలంటే తెలంగాణ ఉద్యమం కంటే పెద్ద ఉద్యమం చేయవలసి వస్తుంది. తన జీవితాన్ని తెలంగాణ ఉద్యమానికి అంకితం చేసిన ఆచార్య జయశంకర్ గారి కనీసం 6 అంగుళాల విగ్రహం హైదరాబాద్ లో ప్రభుత్వం తరపున పెట్టకపోవడం, అందరిని బాధిస్తున్న అంశం’ అని లేఖలో పేర్కొన్నారు.