కేరళ ఈ పేరు వినగానే కళ్ల ముందు ఏపుగా పెరిగిన కొబ్బరిచెట్లు ఎటు చూసినా నదులు వాటిపై తేలియాడుతూ ఉంటే పడవలు సముద్రపు వంటలు మోహినియాట్టం నృత్యం,కలరిపట్టు యుద్ధ విద్యలు అలా కదలాడుతాయి.పశ్చిమ కనుమలతో ఎటు చూసినా పచ్చదనం పరుచుకొని ఉండడంతోనే కేరళకు దేవుళ్ల భూమి(గాడ్స్ ఓన్ ల్యాండ్)గా పిలుచుకుంటారు.ఎన్నో పర్యాటక,చారిత్రాత్మక ప్రాంతాలకు నెలవైన కేరళలో అతిముఖ్యమైన పర్యాటక ప్రాంతం తెన్మెల.ఒకప్పుడు తేనెటీగలకు పుట్టినిల్లు కావడంతో ఈ ప్రాంతానికి తెన్మెల పేరు వచ్చింది.నగర రణగొణ ధ్వనులు,కాలుష్యానికి దూరంగా ఉండే తెన్మెల అరణ్య జీవన సంస్కృతికీ, సమకాలీన జీవన చిత్రానికి నిలువుటద్దంగా నిలుస్తోంది.హృదయాల్ని ఇట్టే కట్టిపడేసే శోభాయమాన లోయలు,ఔషధమూలికల నిధి అయిన తెన్మెలను ఒక్కసారైనా సందర్శించాల్సిందే.తెన్మెలకు ఆ అర్హత ఉంది కూడా.తెన్మెలలో ప్రధానంగా చూడదగిన ప్రదేశాల గురించి చెప్పాలంటే..
గార్గియస్ నేచర్ ట్రేల్:
పర్వతాల మీదుగా దట్టమైన అడవుల మధ్యలో స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆహ్లాదకరమైన దృశ్యాలు,లోయలు చూడాలనుకునే వాళ్లకు గార్గియస్ నెచర్ ట్రేల్ చక్కటి ప్రాంతం.ఇదొక్కటే కాదు సంప్రదాయ విలువలు కలిగిన వ్యక్తులకు,ప్రకృతి ప్రేమికులకు చివరకు సాహసీకులకు కూడా ఈ ప్రాంతం అనువైన ప్రాంతం..
తెన్మెల పరప్పర్ వంతెన:
కేరళ రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద నీటి పారుదల ప్రాజెక్ట్గా పరప్పర్ వంతెన.లీజర్ జోన్ నుంచి వెళ్లే మార్గంలో ఎదురయ్యే ఈ వంతెనను అతి పొడవైన వంతెనగా కూడా గుర్తింపు కలిగిఉంది.షెండున్ని జాతి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఇక్కడి మరో ప్రధాన ఆకర్షణ..
ఆహ్లాదపరిచే ట్రీ హౌజ్:
ఎత్తైన చెట్ల కొమ్మలపై ఏర్పరిచిన కుటీరాల నుంచి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలు తిలకించడం వాటిలో గడపడం అనేది ఊహకందని అనుభూతి. నిరంతరం చల్లచల్లని గాలులు వీచే ఈ చోట వేలాది పక్షుల గుంపులు వాటి కిళకిళ రావాలు,కేరింతల వినిపించే ట్రీహౌజ్లో కొన్నాళ్లు ఉండాలనే భావన కలుగుతుంది.అటువంటి అనుభూతిని సొంతం చేసుకోవాలంటే తెన్మెలలోని ట్రీహౌజ్ను చూడాల్సిందే..
వేలాడే వంతెన:
సాధారణంగా నగరాల్లో కనిపించే హ్యాంగింగ్ బ్రిడ్జ్లను చూసిన నగరవాసులు తెన్మెలలో కల్లాడ నదిపై నిర్మించిన వేలాడు వంతెన చూస్తే ఔరా అని నోళ్లు తెరవాల్సిందే.1877లో తెన్మెలలో నిర్మితమైన హ్యాంగింగ్ బ్రిడ్జ్ అప్పటి ఇంజనీర్ల సృష్టికి ఒక అద్భుత నిదర్శనం. బ్రిటిష్ ఇంజనీర్ ఆల్బర్ట్ హెన్నీ సారథ్యంలో నిర్మాణమైన ఈ వంతెన 400అడుగుల పొడవుతో ఈ వంతెనను కలప పలకలను బిగించడం ద్వారా ఏర్పరిచారు. రెండు చివర్లల్లో కేవలం రెండు స్థంభాలతో ఈ వంతెనను పూర్తి చేశారు.
పాలరువి జలపాతాలు:
వెండి వర్ణంతో నురగలు కక్కుతూఐ వయ్యారంగా జాలువారే పాలరువి జలపాతాలు చూపుతిప్పుకోనివ్వవంటే అతిశయోక్తి కాదేమో.కేరళ – తమిళనాడు సరిహద్దులలో పాలరువి కొల్లం కు 75 కి.మీ. దూరంలో ఉండే ఈ నీటి స్వర్గాన్ని చేరాలంటే 4 కి.మీ. దూరం ట్రెక్కింగ్ చేయాలి. తేన్మలై సందర్శకులకు ఇది ఒక ప్రత్యెక ఆకర్షణ.
ఆర్యంకావు :
ఆర్యంకావు ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ రేంజ్ అంటారు. కొల్లం జిల్లా కు తూర్పు దిశగా 75 కి.మీ. దూరంలో కలదు. తేన్మలై కు సమీపంలో కల ఆర్యంకావు గ్రామం జిల్లాలోని ప్రదాన ఆకర్షణలలో ఒకటి. ఆర్యంకావు లోని ప్రధాన ఆకర్షణ పాలరువి జలపాతాలు. ఈ క్షేత్రం లేడి సెయింట్ మేరీస్ రోమన్ కేథలిక్ చర్చి మరియు జార్జ్ మలంకర కాథలిక్ చర్చి భక్తులను ఆహ్వానిస్తుంది.
13 ఆర్క్ బ్రిడ్జ్ :
1904వ సంవత్సరంలో ఆంగ్లేయులు కొల్లం నుంచి మద్రాసుకు రైలు మార్గం నిర్మించాలనే ఉద్దేశంతో కొండల మార్గంలో నిర్మించిన 13 ఆర్క్ బ్రిడ్జ్ దేశంలోనే పురాతన రైలు మార్గంలో ఒకటి.సుర్కి పద్ధతిలో సిమెంటు,ఇనుము వంటి వస్తువులు వినియోగించకుండా కేవలం రాళ్లతో మాత్రమే ఈ బ్రిడ్జ్ను నిర్మించడం ప్రత్యేకత.ఎత్తైన కొండల మధ్య పురాతన 13 ఆర్క్ బ్రిడ్జ్పై రైలు ప్రయాణం జీవితంలో మరచిపోలేని అనుభవం..
షెండున్నిజాతి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం..
పలు రకాల జాతులకు చెందిన జింకలకు ఆలవాలంగా ఉన్న డీర్ రిహాబిటేషన్ సెంటర్ తెన్మెలకు మరో ప్రధాన ఆకర్షణ.ఇక్కడి సెంటర్లో చుక్కల జింకలతో పాటు బార్కింగ్ జింకలు,సాంబార్ జింకలు తదతర పలు రకాల షెండున్ని జాతి జింకలను చూడవచ్చు..
సాహస క్రీడలకు సైతం..
పర్యాటకుల సౌకర్యార్థం కల్చర్ జోన్, లీజర్ జోన్, అడ్వెంచర్ జోన్ అంటూ మూడు జోన్ ల కింద విభజించిన తెన్మెల సువిశాల పర్యాటక ప్రాంతం సాహసీకులకు కూడా ఎంతో అనువైన ప్రాంతం.రాక్ క్లైంబింగ్,రివర్ క్రాసింగ్,ర్యాపెల్లింగ్,మౌంటేన్ బైకింగ్ వంటి సాహస క్రీడలంటే ఇష్టపడే సాహసీకులకు తెన్మెల చక్కటి ప్రాంతం..
తేన్మల ఎలా చేరుకోవాలి ?
రోడ్డు మార్గం తేన్మలై కు తిరువనంతపురం మరియు కొల్లం ల నుండి ప్రభుత్వ లేదా ప్రైవేటు బస్సులలో చేరవచ్చు. రోడ్డు మార్గంలో టాక్సీ మరియు ఇతర వాహనాలలో కూడా చేరవచ్చు. రైలు మార్గం తేన్మలైకు 66 కి.మీ. దూరంలో కల కొల్లం లో రైలు స్టేషన్ కలదు. ఇక్కడకు దేశంలోని అన్ని ప్రాంతాలనుండి రైళ్ళు నడుస్తాయి. రైలు స్టేషన్ నుండి టాక్సీలలో తేన్మలై కు చేరుకోవచ్చు. టాక్సీ చార్జీలు కి.మీ. కు సుమారు రూ. 7 నుండి రూ. 11 వరకు ఉంటాయి. వాయు మార్గం తేన్మలై కు సమీపంలో సుమారు 72 కి.మీ. దూరంలో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. ఇక్కడి నుండి ఇండియా లోని ప్రధాన నగరాలకు విమాన ప్రయాణ సదుపాయాలు కలవు. విమానాశ్రయం నుండి టాక్సీ లలో తేన్మలై చేరుకోవచ్చు.