గతనెల 27వ తేదీన హైదరాబాద్ నగర శివార్లలో జరిగిన దిశ హత్యాచారం అనంతరం నలుగురు నిందితుల ఎన్కౌంటర్ ఘటనలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి.అయితే ఈ రెండు ఘటనల్లో ఒక విచిత్రం తాజాగా వెలుగు చూసింది.రెండు ఘటనల్లో మొదట మృతులను చూసింది పాలు వ్యాపారం చేసే సత్యం అనే ఒకే వ్యక్తి కావడం గమనార్హం.దిశను నిందితులు సజీవదహనం చేసిన రోజున ఉదయం ఐదు గంటల వేళలో పొలానికి వెళుతున్న సత్యం మంటను చూసి చలి మంటగా భావించారు. తర్వాత ఏడు గంటల సమయంలోనూ ఇంకా కాలుతూ ఉన్న వైనాన్ని చూసి.. అనుమానం వచ్చి చూడగా.. అది దిశదిగా అర్థమై వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఇక ఎన్కౌంటర్ విషయానికి వస్తే.. ఎప్పటిలానే శుక్రవారం ఉదయం ఐదు గంటలకు కొట్టంలో పాలు పితికేందుకు వెళ్లాడు. ఆ సమయంలో కొందరు పోలీసులు అతన్ని అటు రావొద్దని.. తర్వాత రమ్మని సత్యాన్ని తిప్పి పంపారు. తర్వాత ఆరు గంటలకు వచ్చిన అతను తన పని తాను చేసుకొని వెళ్లిపోయాడు.అనంతరం ఎన్కౌంటర్ జరిగిన విషయం ప్రపంచానికి తెలిసింది.దీనిపై సత్యం సోదరుడు వెంకటరెడ్డి స్పందించారు. తమకు 30 ఎకరాల పొలం ఉందని.. వరి.. టమోటా పంటలు పండిస్తామని చెబుతున్నారు. మొత్తానికి రెండు ఉదంతాలను తొలుత చూసింది సత్యమే కావటం గమనార్హం.