చట్టాలు,అవినీతి నిరోధక శాఖలు ఎన్ని ఎన్నా దేశంలో అవినీతికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు.రోజురోజుకు పెరుగుతుందే కానీ తగ్గుముఖం పట్టడం లేదు.ఈ నేపథ్యంలో ‘ఇండియా కరప్షన్ సర్వే-2019′ పేరుతో ట్రాన్పెరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యంత అవినీతి చోటు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో రాజస్థాన్ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది.విచారకర విషయం ఏంటంటే ఈ జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో నిలిచింది.రాజస్థాన్ తరువాతి స్థానాల్లో వరుసగా బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిలిచాయి.అతి తక్కువ అవినీతి కలిగిన రాష్ట్రంగా కేరళ ఘన కీర్తీని సొంతం చేసుకుంది. గోవా, ఒడిశాలు కూడా అవినీతికి అత్యంత దూరంగా ఉన్న రాష్ట్రాలుగా నిలిచాయి. మొత్తం 21 రాష్ట్రాల్లో ఈ సర్వేను ట్రాన్స్ పెరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే… ఆస్తుల రిజిస్ట్రేషన్, భూ వివాదాల అంశాల్లో ఎక్కువ అవినీతి చోటుచేసుకుంది.మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా భారీ ఎత్తున అవినీతి జరుగుతోందని తేలింది. తమ పనులు చేయించుకోవడానకి లంచాలను ఇచ్చినట్టు 67 శాతం మంది ప్రజలు తెలియజేశారు. పలుమార్లు లంచాలను ఇవ్వాల్సి వచ్చిందని 56 శాతం మంది తెలిపారు. 11 శాతం మంది మాత్రం ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే తమ పనులు అయ్యాయని చెప్పారు.కాగా ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 13వ స్థానం దక్కడం గమనార్హం..
మొదటి 15 రాష్ట్రాల జాబితా ఇలా..
- రాజస్థాన్
- బీహార్
- జార్ఖండ్
- ఉత్తరప్రదేశ్
- తెలంగాణ
- కర్ణాటక
- పంజాబ్
- తమిళనాడు
- చత్తీస్ ఘడ్
- మధ్యప్రదేశ్
- మహారాష్ట్ర
- ఉత్తరాఖండ్
- ఆంధ్రప్రదేశ్
- గుజరాత్
- ఢిల్లీ