అమరావతి: ఓట్ల తొలగింపునకు వ్యతిరేకంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నిచ్చారు. పార్టీ నేతలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఇక్కడి నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో పరాజయం పాలవుతామనే భీతితోనే ఎనిమిది లక్షల తెదేపా ఓట్లు తొలగించే ప్రయత్నాల్ని ప్రారంభించారని ఆరోపించారు. వచ్చే ఓట్ల నమోదు, తొలగింపులో అక్రమాల్ని సహించేది లేదని హెచ్చరించారు. దొంగ సంతకాలు పెట్టిన వారందరినీ గుర్తించాలని అధికారులను ఆదేశించిన ఆయన నకిలీ దరఖాస్తుదారులపై కఠిన చర్యల్ని తీసుకుంటామని చెప్పారు. సైబర్ నేరగాళ్ల అంతు చూస్తామని తేల్చి చెప్పారు. వైకాపా నేతలు నేరాల్ని చేయటంలో ఆరితేరారని ఆరోపించారు. ఎన్నికల పర్వానికి ముందే ముందే వైకాపా ఓటమిని అంగీకరించి దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని ధ్వజ మెత్తారు. వైకాపా నేతలకు నిరాశ, నిస్పృహలకు గురై తెలంగాణలో తమకు వ్యతిరేకంగా ఫిర్యాదుల్ని చేస్తున్నారని దుయ్యబట్టారు. రెండు దశాబ్ధాల పాటు ఎంతో శ్రమించి కంప్యూటరీకరించిన సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వ సాయంతో దొంగలించే నీచానికి పాల్పడినట్లు ఆరోపించారు. సైబర్ కుట్రలతో హైదరాబాద్ను అభద్రతలోకి నెట్టారని, వ్యాపార కంపెనీలకు హైదరాబాద్లో భద్రత లేని దుస్థితి నెలకొందన్నారు. టీడీపీకి సేవలు అందించే కంపెనీలపై దాడులు చేస్తున్నారని, వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలకు కంపెనీలను బలి చేస్తున్నారని అన్నారు. ఈ దుర్మార్గాలకు మోదీ, కేసీఆర్ సహకరిస్తున్నారని ఆక్రోశించారు. సాంకేతికతను తాము ప్రోత్సహిస్తుంటే, సైబర్ నేరాన్ని వాళ్లు ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. వీటన్నింటికీ గట్టిగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇలాంటి వారు అధికారంలోకి వస్తే ఇంకెన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారోనని వ్యాఖ్యానించారు. ఎవరెన్ని కుట్రలుపన్నినా, కుతంత్రాలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ గెలుపును అడ్డుకోలేరని అన్నారు. సైబర్ కుట్రలతో హైదరాబాద్ను అభద్రతలోకి నెట్టారని, వ్యాపార కంపెనీలకు హైదరాబాద్లో భద్రత లేని దుస్థితి నెలకొందన్నారు. టీడీపీకి సేవలు అందించే కంపెనీలపై దాడులు చేస్తున్నారని, వైసీపీ, టీఆర్ఎస్ కుట్రలకు కంపెనీలను బలి అవుతున్నాయని ఆవేదన చెందారు.