న్యూ ఢిల్లీ : దేశ వ్యాప్తంగా పేదలు, నిరుద్యోగులను ఆదుకునేందుకు పట్టణ ప్రాంతాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని, తమ పార్టీ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకాల్ని వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ట్విట్టర్ లో కేంద్రాన్ని డిమాండు చేసారు. ‘పట్టణాల్లో నిరుద్యోగ సమస్య ఎదుర్కొంటున్న వారి కోసం మనరేగా పథకం అమలు చేయడం అవసరం. దేశవ్యాప్తంగా ఉన్న పేద ప్రజల కోసం న్యాయ్ పథకాన్ని అమలు చేయాలి. సూటు-బూటు-లూట్ ప్రభుత్వం పేదల బాధలను అర్థం చేసుకుంటుందా?కరోనాతో జనం అల్లాడుతున్నందున ఉపాధి హామీ పరిధిని పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. పేదలకు నేరుగా నగదు బదిలీ చేయాలి. జన్ధన్ ఖాతాలు, ఫించను, పీఎం-కిసాన్ ఖాతాల్లో రూ.7,500 జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంద’ని పేర్కొన్నారు.