హొసూరు : ఇక్కడికి సమీపంలో జాతీయ రహదారిపై వెళ్తున్న కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. వాహన చోదకులు అప్రమత్తం చేయడంతో కారులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు. బెంగళూరుకు చెందిన వెంకటేశ్ తన కుటుంబ సభ్యులతో కలసి చెన్నైలో బంధువుల ఇంట శుభ కార్యానికి వెళ్లి వస్తుండగా ఈ సంఘటన జరిగింది. మంగళవారం వేకువ జామున కృష్ణగిరి-హొసూరు జాతీయ రహదారిలోని గొల్లపల్లి వద్ద కారులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారులోని వారు దీనిని గమనించలేదు. ఆ దారిలో వస్తున్న వాహన చోదకులు మంటలను చూసి వారిని అప్రమత్తం చేశారు.
వెంకటేశ్ వెంటనే కారును ఆపి తన కుటుంబ సభ్యులను కిందకు దింపివేశారు. కొద్దిసేపటికే మంటలు బాగా వ్యాపించి కారు దగ్ధమైంది. వాహన చోదకులు అప్రమత్తం చేయకుండా ఉంటే పెద్ద ప్రమాదం జరిగేది.