బెంగళూరు : ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో ఆదివారం రాత్రి సీఎస్కేతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో ఆర్సీబీ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్లో 26 పరుగులు అవసరం కాగా కెప్టెన్ ధోనీ 24 పరుగులు చేశాడు. చివరి బంతికి శార్దుల్ ఠాకూర్ రనౌట్ కావడంతో ఆర్సీబీని విజయం వరించింది. అయితే 19వ ఓవర్లో మూడు సార్లు సింగిల్స్ తీసే అవకాశం ఉన్నా, ధోనీ ప్రయత్నించకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆ సింగిల్స్ తీసి ఉంటే సీఎస్కే గెలిచి ఉండేదనే వాదనా ఉంది. పైగా నాన్ స్ట్రైకర్గా బ్రావో ఉన్నాడు. అతనూ బంతిని బౌండరీకి తరలించే సత్తా ఉన్నవాడే. మరి ధోనీ ఎందుకలా చేశాడనేది ప్రశ్న. ‘నేను అప్పటికే క్రీజులో స్థిరపడ్డాను. ఛేదనలో బ్యాట్స్మెన్పై ఒత్తిడి ఉండనే ఉంటుంది. కొత్తగా వచ్చిన బ్యాట్స్మన్ వెనువెంటనే ఫోర్లు, సిక్సర్లు కొట్టడం అంత సులభం కాదు. అందుకే ఆ బాధ్యతను నా భుజాలపై వేసుకున్నాను` అని ధోనీ వివరించాడు. సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా దీనిని సమర్థించాడు. ఉత్కంఠభరిత మ్యాచుల్లో ధోనీ ఎన్నో విజయాలు అందించాడని, ఈ సింగిల్స్ విషయంలో తాము అతని సంజాయిషీ అడగదలచుకోలేదని ఫ్లెమింగ్ తెలిపాడు.