మరో భారీ ఆలయాన్ని నిర్మించేందుకు కసరత్తు జోరుగా సాగుతోంది. కర్ణాటకలోని హంపీలో హనుమాన్ ఆలయాన్ని పెద్ద ఎత్తున నిర్మిస్తున్నారు. అయోధ్యలో రామ మందిరాన్ని ఏ రీతిలో అయితే నిర్మిస్తున్నారో.. అదే రీతిలో హంపీలోనూ భారీ ఆలయాన్ని నిర్మించనున్నారు. 215 అడుగుల ఎత్తులో హనుమంతుని విగ్రహాం ఈ ఆలయ ప్రత్యేకతగా చెప్పాలి. ఇందుకోసం భారీగా ఖర్చు చేయనున్నారు. కర్ణాటకలోని తుంగభద్ర నది ఒడ్డున ఉన్న కిష్కింద ప్రాంతంలో ఈ మందిరాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు రూ.1200 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని రూపొందిస్తున్నారు. హనుమాన్ ఆలయానికి సమీపంలో రామ్ లాలా మందిరాన్ని నిర్మిస్తున్నారు. రెండేళ్ల వ్యవధిలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది సంకల్పంగా పెట్టుకున్నారు.ఇప్పుడు ఆలయాన్ని నిర్మిస్తున్న ప్రాంతాన్ని వాల్మీకి రామాయణంలో సుగ్రీవుని రాజ్యంగా పేర్కొన్నారు. ఈ భారీ విగ్రహాన్ని తయారు చేయటానికి హనుమాన్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాట్లు చేస్తోంది. రానున్న రోజుల్లో భారీ ఎత్తున విరాళాల స్వీకరణ కోసం రథయాత్రను నిర్వహించనున్నారు.