అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను నవంబర్ 1న అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో మూడు రోజుల పాటు వేడుకలను నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారు. విభజన తర్వాత తొలిసారిగా అధికారికంగా అవతరణ వేడుకలు నిర్వహించనుండటంతో ప్రభుత్వం వీటిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించాలని నిర్ణయించింది. తొలి రోజున హస్త కళల ప్రదర్శన నిర్వహిస్తారు. రెండో రోజు కూచిపూడి నృత్య ప్రదర్శన, లలిత కళలు, సురభి నాటకాలు, జానపద కళల ప్రదర్శన ఉంటాయి. మూడో రోజున తెలుగు సంప్రదాయ ఆహార ప్రదర్శన నిర్వహించనున్నారు.