ముంబై : టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ క్రికెట్ దిగ్గజాల నుంచి చాలా నేర్చుకున్నాడు. ధావన్ ఆడుతున్న ఢిల్లీ కేపిటల్స్కి సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్లు సలహాదారులుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ మ్యాచ్ను అధ్యయనం చేసే తీరు తననెంతో ఆకట్టుకుందని ధావన్ చెప్పాడు. వారితో కలసి పని చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నాడు. వారి ఆలోచనలు, మ్యాచ్ను అర్థం చేసుకునే పద్ధతిని చాలా దగ్గరగా చూశానని, ఇప్పటికే వారి నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపాడు. ప్రస్తుత ఐపీఎల్లో నాకు ఉపయోగపడుతున్న వారి ఆలోచనలను ప్రపంచ కప్పులోనూ కార్య రూపంలో పెడతానని వివరించాడు. తన సహచరుడు పృథ్వీ షా ఆటతీరును ధావన్ ఎంతగానో ప్రశంసించాడు. ఎంతో పోటీ ఉన్న భారత జట్టులోకి 19 ఏళ్ల కుర్రాడు రావడమంటే చిన్న విషయం కాదని అన్నాడు.